Friday, October 1, 2010

మహాజనం చెక్కిన సజీవశిల్పం వైఎస్ * సంస్మరణ

వైఎస్‌పై నేడు బురద జల్లుతున్న వారిలో అత్యధికులు కాంగ్రెస్‌లోని ఒకనాటి ప్రత్యర్థులే. తెలుగుదేశం పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ అధిష్టానం పేరు చెబుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు వైఎస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైఎస్‌ను రక్షణ కవచంలా కాపాడి వెన్నంటి నడిచిన ప్రజలు వెఎస్ పథకాలను, కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కావలసిందల్లా వారి ఆకాంక్షలకు, ఆశయాలకు అద్దంపడుతూ వైఎస్ పథకాలను చిత్తశుద్ధితో అమలుచేసే నాయకత్వం ముందుకు రావడమే.

ప్రజలు చరిత్ర నిర్మాతలు. వారు చరిత్రను ప్రభావితం చేసే నాయకులను సృష్టించుకుంటారు. ధీరోదాత్త నాయకులను పసిగట్టి రక్షించుకోగల శక్తి వారికి స్వాభావికం. వైఎస్ ఒక అపురూపమైన నాయకుడు. ఆయన వ్యవహార శైలి అద్వితీయం. ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోవడం, వారి ఆకాంక్షలను గౌరవించడం, అర్థం చేసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కాంగ్రెస్ పార్టీ నేతలలో ఈ గుణం అతి అరుదు. వైఎస్ ఒక ప్రతిభావంతుడైన నాయకుడు కావడం వలన ఆయనకు బలమైన రాజకీయ ప్రత్యర్థులు ప్రతిపక్షంలోనేకాక సొంత పార్టీలోనూ నిరంతరం వెంటాడారు.

రాయలసీమలో ప్రత్యేకించి కడప జిల్లా నేపథ్యంలో అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన నాయకులు కాంగ్రెస్‌లోనూ, తెలుగుదేశంలోనూ మనకు తారసపడతారు. వీరిని రాజకీయంగా జయించడానికి ఆయన అనుసరించిన విధానాలు విశిష్టమైనవి. విశ్వసనీయత పెంచుకోవడం, పరిస్థితులకు తగినట్టు స్పందించడం, ప్రజా ప్రయోజనాల కోసం స్వపర భేదాలు లేకుండా ప్రధాన పక్షాలతో విభేదించడం, పోరాడటం ఆయనలో ప్రత్యేక లక్షణం. నిరంతరం శ్రమించడం, ప్రజలతో, కార్యకర్తలతో, తన మద్దతుదారులతో సజీవ సంబంధాలు కలిగి ఉండటం, వారి అవసరాలకు స్పందించడం రోజువారి కార్యక్రమం. ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ, నిరంతర అధ్యయనం ఆయనను బలీయమైన నాయకుడిగా తీర్చిదిద్దాయి.

ఆయన అనర్గళమైన ఉపన్యాసకుడు కాదు. పెద్ద ఆర్థికవేత్త అంతకంటే కాదు. ఒక మారుమూల నియోజకవర్గం నుంచి అంచెలంచెలుగా ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ఎదిగివచ్చిన నేత. కఠోరమైన దీక్ష, పట్టుదల, ఎన్ని అపవాదులు, అపనిందలు, అవహేళనలు, నీలాపనిందలు ఎదురైనప్పటికీ ప్రజల ఆశీస్సులతో, మద్దతుతో వాటిని అధిగమించిన ధీశాలి. ప్రజల ఆశీస్సులు ఆయనకు శ్రీరామరక్షగా నిలిచాయి.


సంప్రదాయ కాంగ్రెస్ వ్యవహారశైలికి భిన్నంగా వైఎస్ ప్రజలను సమీకరించారు, చైతన్యపరచారు, ఆందోళనలు చేపట్టారు. ఒక ప్రాంతీయ పార్టీ (తెలుగుదేశం) రాష్ట్రంలో తమిళనాడు, బెంగాల్, యూపీ, బీహార్ రాష్ట్రాలలో వలే వేళ్లూనుకొని పోయిందన్న భావనను పెకలించిన బలశాలి వైఎస్. ఆయన ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాల్పడిన అనేక ప్రజావ్యతిరేక విధానాలు, గ్రూపు తగాదాలను, అవినీతి అక్రమాలను ప్రాంతీయ తెలుగుదేశం విమర్శిస్తుంటే, కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన జరిపిన రాజకీయ పోరాటం విలక్షణమైనది.

ఆయన రాయలసీమ ఉద్యమంలో లేపాక్షి-పోతిరెడ్డిపాడు పాదయాత్ర, విద్యుత్ ఉద్యమంలో 18 రోజుల నిరాహార దీక్ష, సీమ సమస్యలపై 13 రోజుల నిరాహార దీక్ష, చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురానికి 1,600 కిలోమీటర్ల పాదయాత్ర, సద్భావనయాత్రలు, కాంగ్రెస్ శ్రేణులను ఐక్యపరుస్తూ జరిపిన బస్సు రథయాత్రలు, కార్యకర్తలకు, ప్రజలకు, రైతులకు కష్టాలు ఎదురైనప్పుడు వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి నిరంతరం ప్రజల వద్దకు వెళ్లారు. ప్రజలలో విశ్వాసం కల్పించి మరో ఇందిరమ్మ పాలన రాబోతున్నదని, ప్రజలు ఆశావహ వాతావరణంలో జీవించాలని, ఆత్మహత్యలు మానుకోవాలని, పోరాటాలకు సిద్ధం కావాలని చేసిన దీక్షలు, పోరాటాలు అసామాన్యమైనవి. రాజకీయ రంగ నిపుణులు లోతుగా విశ్లేషించదగినవి.

వైఎస్‌ను ప్రజలు నమ్మారు. ఆయన కష్టాలలో భాగస్వాములు అయ్యారు. రాయలసీమ ఉద్యమాన్ని కాంగ్రెస్ అధిష్టానం, ప్రత్యేకించి ఆనాటి పీసీసీ అధ్యక్షులు జలగం వెంగళరావు గుర్తించలేదు. పైగా ఉద్యమంతో సంబంధంలేదని బాహాటంగా ప్రకటించారు. అలాగే చేవెళ్ల- ఇచ్ఛాపురం పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్‌పార్టీలోని బలమైన నాయకత్వం ఒక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు, ఆయన అనుచరులు పాదయాత్ర పవిత్రతను ప్రశ్నిస్తూ తెలుగుదేశం నాయకులు కూడా చేయని విమర్శలు చేశారు. కోట్లు ఖర్చుపెడుతూ, ఏసీ రూముల్లో గడుపుతూ జరుగుతున్న పాదయాత్రగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పాదయాత్రలో రాజమండ్రిలో మజిలీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నాటి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాం నబీ ఆజాద్ ముఖ్యఅతిథిగా రావడానికి నిరాకరించారు. కానీ ప్రజలు బాధ్యతగా, ఆప్యాయతతో, అభిమానంతో వైఎస్‌ను దీవించారు. ఆయన వెంట నడిచారు.

ఒక సందర్భంలో వైఎస్‌కు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని 18 మంది ఎంపీలు సంతకాలు చేసి నాటి ప్రధాని పీవీ నరసింహారావుకు విజ్ఞప్తిని సమర్పించారు. 78 మంది శాసన సభ్యులు పులివెందుల అసెంబ్లీ నుంచి ఎన్నిక కావడానికి ఆయన అభ్యర్థిత్వం అంగీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అధిష్టానం అంగీకరించలేదు. అనంతపురంలో సద్భావనయాత్ర ఏర్పాటు చేస్తే ఆ నాటి కేంద్ర మంత్రి రాజేష్ పైలట్‌ను సభకు రానివ్వకుండా అధిష్టానం అడ్డుపడేటట్లు కొందరు నాయకులు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ వైఎస్ రాజకీయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో నాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రానికి వచ్చి చంద్రబాబునాయుడు పాలనను కొనియాడుతూ పొగడ్తలు కురిపించారు. ఎంతో హుందాగా ఈ పరిణామాలను వైఎస్ స్వీకరించారు. తనదైన పరిధిలో ప్రజలకు చేరువగా ఉంటూ పోరాటాలు చేశారు.

1989-90 ఎన్నికల్లో స్వర్గీయ రాజీవ్‌గాంధీ వైఎస్‌ను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల భారాన్ని స్వీకరించవలసిందిగా కోరాడు. వైఎస్ యువకుడిగా ఏ పదవులు లేకుండా తెలుగుదేశాన్ని మట్టికరిపించే క్రమంలో క్రియాశీలక శక్తిగా ఎదిగాడు. వైఎస్ సభలకు ప్రజలు విశేషంగా తరలివచ్చారు. ఇష్టపూర్తిగా ఆశీర్వదించారు. 1989-94 మధ్య అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధిని సాధించడంలో పూర్తిగా విఫలమయింది. కాంగ్రెస్ శ్రేణులను, సానుభూతిపరులను, కార్యకర్తలను చివరకు శాసనసభ్యులను సైతం నిర్లక్ష్యం చేశారు. ఈ సంక్షుభిత సందర్భంలోనే రాజశేఖరరెడ్డిలోని ప్రజానాయకుడు వెలికి వచ్చాడు. ఆనాటి ముఖ్యమంత్రుల ప్రజావ్యతిరేక విధానాలను, మంత్రుల బాధ్యతారాహిత్యాన్ని ఎండగడుతూ నిజమైన జనహిత నేతగా ప్రజల ముందు నిలిచారు. ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే, తన సొంత పార్టీలోని నాయకులను సైతం వైఎస్ ధిక్కరించగలడని, వారితో పోరాడగలడని ఒక శక్తివంతమైన సంకేతాన్ని ఆయన ప్రజలకు అందచేశారు.

కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ అనేక అవమానాలను, అడ్డంకులను, నిందలను భరించాడు. ఆయన బెరైటీస్ గనుల లీజు కాంగ్రెస్ హయాంలోనే రద్దు కావడం గమనార్హం. ఆయన తండ్రిని కాంగ్రెస్‌లోని తన ప్రత్యర్థులు, తెలుగుదేశంలోని తన రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి హత్య చేయించారు. ఇటువంటి అనేక చర్యలు ఆయనను తన రాజకీయ పోరాటం నుంచి మళ్లించడానికి, అతనిని మానసికంగా లోబర్చుకోవడానికి స్థానిక ఫ్యాక్షన్ రాజకీయాలలో చేరిపోవడానికి జరిగిన చర్యలుగా భావించి వైఎస్ రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేసేందుకు నడుం బిగించారు. కడప, ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గంలో ఆయన అనుచరులు ప్రత్యర్థులపై చర్యలు తీసుకోకుండా నివారించడాన్ని అవతలి పక్షం జీర్ణం చేసుకోలేకపోయింది. అయినా ఆయన తన ధ్యేయాన్ని మార్చుకోలేదు. వైఎస్ 1989లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించడంలోనే కాదు, 1999లో కూడా కాంగ్రెస్‌ను దరిదాపుగా విజయానికి చేర్చారు. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి.

రాజీవ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. నాయకత్వ లోటు స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో వైఎస్ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటూవచ్చారు. సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్‌కు తిరిగి బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర అనేక రాష్ట్రాల్లో సోనియా అండదండలు కలిగిన నాయకులు సాధించలేని విజయాలను వైఎస్ కాంగ్రెస్ పార్టీకి చేసి చూపెట్టారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల విధేయుడుగా తాను చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వారి పేర్లు పెట్టారు. బలమైన ప్రాంతీయ పార్టీని ఎదుర్కోవాలంటే రాష్ట్రాల్లో బలమైన ప్రజాపునాది కలిగిన నాయకులు స్థానికంగా ఎదగాలని వైఎస్ తరచూ ఏఐసీసీ సమావేశాల్లో ప్రస్తావించేవారు. జిల్లా కమిటీలకు, రాష్ట్ర కమిటీలకు స్వయం నిర్ణయాధికారం కావాలని, పార్టీలో వికేంద్రీకరణ జరగాలని కోరుతూనే బలమైన కేంద్రీకృత ప్రజాస్వామిక వ్యవస్థను ఆయన కోరుకునేవారు.

వైఎస్, ఏ రాష్ట్రంలో, ఏ రాజకీయ పార్టీ అమలు చేయని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. పదేళ్ల తెలుగుదేశం పాలనలో రాష్ట్రం ఎంతగా నాశనమైందో తెలిసిందే. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్యసంస్థ, బహుళజాతి కంపెనీల దయాదాక్షిణ్యాలకు భారత ఆర్థిక వ్యవస్థ దాసోహమంటూ మార్కెట్ ఆర్థిక వ్యవస్థే అన్నిటినీ పరిష్కరించగలదని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండకూడదనే బలమైన వాదనలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు సాహసోపేతమైనవి. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకమైనవి. వైఎస్ అకాల మరణంతో భారతదేశం వేగుచుక్కను కోల్పోయింది. ఆయన మరణంతో అందరూ తల్లడిల్లిపోయారు. వైఎస్ మరణించిన ఒక సంవత్సరంలో ఏ రోజూ వైఎస్ ఉనికిని గుర్తించుకోలేని రోజంటూ లేకుండా పోయింది. వైఎస్ వారసత్వాన్ని నిలుపుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమయింది. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ లయ తప్పింది. నేడు ప్రతిపక్ష తెలుగుదేశం, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, ప్రజారాజ్యం పార్టీలు వైఎస్‌పై పనిగట్టుకుని కువిమర్శలు చేస్తున్నాయి. బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయి.

వైఎస్‌పై నేడు బురద జల్లుతున్న వారిలో అత్యధికులు కాంగ్రెస్‌లోని ఒకనాటి ప్రత్యర్థులే. తెలుగుదేశం పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తోడుగా అధిష్టానం పేరుచెబుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు వైఎస్‌ై జలయజ్ఞంపై, సంక్షేమ కార్యక్రమాలపై నిందాపూర్వకమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైఎస్‌కు తోడు నీడగా ఉంటూ రక్షణ కవచంలా కాపాడి వెన్నంటి నడిచిన ప్రజలు వెఎస్ పథకాలను, కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కావలసిందల్లా వారి ఆకాంక్షలకు, ఆశయాలకు అద్దంపడుతూ వైఎస్ పథకాలను చిత్తశుద్ధితో అమలుచేసే నాయకత్వం ముందుకు రావడమే.
ఇమామ్ , సంపాదకులు, ‘కదలిక’

Thursday, September 2, 2010

రాష్టవ్య్రాప్తంగా వైఎస్‌కు ఘన నివాళి
హైదరాబాద్‌ : దివంగత సిఎం, ప్రియతమ నేత డా. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఘన నివాళులర్పించారు. రాష్టవ్య్రాప్తంగా వైఎస్‌ వర్థంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ కార్యకర్తలు నివాళులర్పించారు. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్‌ చిత్రపటానికి మంత్రులు నివాళులర్పించారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఉన్నంతవరకూ కొనసాగిస్తుందని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌లు తెలిపారు.

వైఎస్‌తో ఉన్న ఆత్మీయత గొప్పది : రోశయ్య

హైదరాబాద్‌ : ఆత్మీయుడు వైఎస్‌ఆర్‌ వర్థంతికి వెళ్లాలని ఉన్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో వెళ్లలేకపోయినందుకు ఎంతో బాధగా ఉందని సిఎం రోశయ్య అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధం, ఆత్మీయతను రోశయ్య నెమరు వేసుకున్నారు. వైఎస్‌ స్మృతి నిత్యనూతనమని, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు జనంలో ఎప్పుడూ పచ్చగానే ఉంటాయని సిఎం అన్నారు. అలాంటి మహానేత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిన్నట్లు ఆయన చెప్పారు. వైఎస్‌ ప్రతమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు రోశయ్య తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.


ఇడుపులపాయలో వైఎస్‌కు కుటుంబ సభ్యుల నివాళి

కడప : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ప్రథమ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధివద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సతీమణి వైఎస్‌ విజయమ్మ, తనయుడు జగన్‌, కూతురు, కోడలు, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్‌కు నివాళులర్పించారు.

జనసంద్రంగా మారిన ఇడుపుల పాయ

కడప : జిల్లాలోని ఇడుపుల పాయ జనసంద్రంగా మారింది. దివంగత సిఎం వైఎస్‌ఆర్‌ ప్రతమ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌ను సందర్శించేందుకు ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చారు. జనహృదయ నేతకు జనం నివాళులర్పించారు. అపరభగీరథుని ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని వేడుకున్నారు. దాదాపు లక్ష మంది వరకు వైఎస్‌ అబిమానులు, కార్యకర్తలు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాటన్‌ను సందర్శించినట్లు సమాచారం.

వైఎస్ కుటుంబసభ్యులు విజయమ్మ, జగన్, వివేకానందరెడ్డి తదితరులు సమాధివద్ద పుష్పగుచ్ఛములుంచి నివాళులర్పించారు. వైఎస్ సన్నిహితుడు కేవీపీ దంపతులు మహానేతకు నివాళి అర్పించారు.

వైఎస్ సమాధి పక్కన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి ఇరు వైపుల రెండు స్థూపాలను ఏర్పాటు చేశారు. వాటిపై బైబిల్ సూక్తులను పొందుపరిచారు. 

Thursday, July 8, 2010

అసెంబ్లీలో 'వైఎస్'


ఇన్నర్ లాబీలో 9 అడుగుల నిలువెత్తు చిత్రపటం

గాంధీ, అంబేద్కర్ పటాల ఎత్తు మూడు అడుగులే
ఎవరిని అడిగి పెట్టారని టీడీపీ ప్రశ్న
సభా సంప్రదాయాలను మంటగలిపారని ధ్వజం
స్పీకర్‌ది ఏకపక్ష నిర్ణయమని అభ్యంతరం
బిజినెస్ పర్పస్ కమిటీలో చర్చింకపోవడంపై ఆగ్రహం
ఇది గాంధీ భవన్ అనుకున్నారా: చంద్రబాబు పీవీ, నీలం, ఎన్టీఆర్ పటాలు లేవే: ముద్దు కృష్ణమ
నిబంధనల ప్రకారమే పెట్టాం: స్పీకర్

అసెంబ్లీకి 'వైఎస్' చిత్ర కళ వచ్చింది. శాసనసభ ఇన్నర్ లాబీలో వైఎస్ తొమ్మిది అడుగుల నిలువెత్తు చిత్రపటాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దివంగత నేత జయంతి సందర్భంగా గురువారం ఈ చిత్రాన్ని స్పీకర్ కిరణ్ కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. అయితే... ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించకుండా, బిజినెస్ పర్పస్ కమిటీలో చర్చించకుండా ఫొటోను పెట్టడం, ఇప్పటికే ఉన్న మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మాజీ స్పీకర్ల ఫొటోలకంటే ఇది పెద్ద సైజులో ఉండటం వివాదాస్పదమైంది.

దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పార్లమెంటరీ సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆక్షేపించింది. శాసనసభలోనూ ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావించింది. ఇది అసెంబ్లీనా కాంగ్రెస్ జాగీరా అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క వచ్చి చంద్రబాబును ఆహ్వానించారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, ఆ తర్వాత రమ్మంటే తాము రాలేమని చంద్రబాబు స్పష్టం చేశారు.


అన్నిటికీ తల ఊపలేం: బాబు
"ఇది అసెంబ్లీనా, కాంగ్రెస్ పార్టీ జాగీరా? గాంధీ భవన్ అనుకుంటున్నారా? అసెంబ్లీకి ఉన్న పవిత్రతను కూడా దిగజార్చి రాజకీయ బురదపూస్తున్నారు'' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. "వైఎస్ హయాంలో చోటు చేసుకొన్న అవినీతి, అరాచకం, దోపిడీలపై ఆరేళ్ళు పోరాడాం. ఆయన అనుకోకుండా మరణించినప్పుడు హూందాగా వ్యవహరించాం. ఎంత గౌరవం ఇవ్వాలో అంత ఇచ్చాం.

అంతమాత్రాన ప్రతిదానికీ తలూపలేం. సభా సంప్రదాయాలు, నిబంధనలను తుంగలో తొక్కుతుంటే అభ్యంతరం చెప్పకుండా ఉండలేం'' అని స్పష్టం చేశారు. "పీవీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశానికి ప్రధాన మంత్రి అయిన తొలి తెలుగు వ్యక్తి. ఆయన చిత్రపటం ఇంతవరకూ అసెంబ్లీలో పెట్టలేదు. నీలం సంజీవరెడ్డి నిజాయితీకి పెట్టింది పేరు. ముఖ్యమంత్రిగా, రాష్ట్రపతిగా చేసినా ఆయన ఫొటో పెట్టలేదు. ఎన్టీఆర్, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానేతల చిత్రాలెవరివీ లేవు.

ఇప్పటిదాకా స్పీకర్లుగా పని చేసిన వారి ఫొటోలు పెట్టడం అనవాయితీగా వస్తోంది. ఇతరులవి పెట్టాలంటే... శాసనసభ బిజినెస్ పర్పస్ కమిటీలో చర్చించాలి. లేదా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించవచ్చు. ఏదీ లేకుండా ఇష్టానుసారం స్పీకర్ ఎలా నిర్ణయాలు తీసుకొంటారు?'' అని చంద్రబాబు నిలదీశారు. ఇంత తొందరపాటు ఎందుకని ప్రశ్నించారు. గురువారం ఉదయం అప్పటికప్పుడు సమాచారం ఇచ్చి రమ్మన్నారని... స్పీకర్ అనుసరించాల్సిన పద్ధతి ఇదేనా అని అడిగారు. ముఖ్యమంత్రి రోశయ్య ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకొన్నారేమో అన్నప్పుడు... ఆయన ఒత్తిడి సభలో కూడా కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు.

అంతా మీ ఇష్టమా: గాలి
శాసనసభలోనూ ఈ అంశాన్ని టీడీపీ ప్రస్తావించింది. జీరో అవర్‌లో గాలి ముద్దు కృష్ణమ దీనిపై మాట్లాడారు. "శాసనసభకు కొన్ని నియమ నిబంధనలను, సాంప్రదాయాలు ఉన్నాయి. సభ ఏ పార్టీ సొత్తూ కాదు. శాసనసభ ఆవరణలో విగ్రహం పెట్టాలన్నా, ఫొటో పెట్టాలన్నా జనరల్ పర్పస్ కమిటీని ఏర్పాటు చేసి, దాని ఆమోదం తీసుకోవాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 15మంది సీఎంలు పని చేశారు. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా, పీవీ ప్రధానిగా చేశారు.

ఎన్టీ రామారావు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పారు. బ్రహ్మానంద రెడ్డి, టి. అంజయ్య వంటి ప్రముఖుల ఫొటోలు పెట్టకుండా ఒక్క వైఎస్ ఫొటోనే ఎందుకు పెడుతున్నారు? సీఎంగా ఉండి చనిపోయినంత మాత్రాన ఏ ప్రత్యేకత రాదు. ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు అంబేద్కర్, అల్లూరి సీతారామరాజుల ఫొటోలు పెట్టడం కోసం అప్పటి స్పీకర్లు జనరల్ పర్పస్ కమిటీలను నియమించారు.

ఆ కమిటీలు ఆమోదించిన తర్వాతే వారి చిత్రపటాలను ఏర్పాటు చేశారు. మీరు ఎవరినీ సంప్రదించకుండా వైఎస్ ఫొటోను ఎలా పెడతారు? గాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖుల చిత్రపటాలు 3 అడుగులు మాత్రమే ఉండగా... వాటి పక్కన వైఎస్ చిత్రపటాన్ని 9 అడుగులతో ఎలా ఏర్పాటు చేశారు?'' అని ముద్దు కృష్ణమ నిలదీశారు. ఇదేమైనా గాంధీభవన్ అనుకున్నారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులైన ప్రకాశం పంతులు, బ్రహ్మానందరెడ్డి తదితరుల చిత్రపటాలున్నాయని స్పీకర్ తెలిపారు.

అయినప్పటికీ ముద్దు కృష్ణమ శాంతించలేదు. 'వైఎస్ చిత్రపటంపై ఈరోజు 11 గంటలకు బులెటిన్ జారీ చేశారు. ఆ బులెటిన్ శాసనసభ సొత్తు. మీరు ఎవరిని అడిగారు? సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఎవరిచ్చారు? మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడం సరికాదు. ఇది గాంధీభవన్ కాదు..' అంటూ ఆగ్రహించారు. స్పీకర్ కూడా అంతే తీవ్ర స్వరంతో స్పందించారు.

"మీరు పరిధులు అతిక్ర మిస్తున్నారు. నిబంధనలకు లోబడే నిర్ణయం తీసుకున్నాం. స్పీకర్‌ను ప్రశ్నించే అధికారం మీకు లేదు'' అని స్పష్టం చేశారు. ఈ దశలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పీఆర్పీ అధినేత చిరంజీవి కోరారు. ఇస్తానంటూనే స్పీకర్ టీవీ రామం కోసం సభను వాయిదా వేశారు.

జయంతి ప్రస్తావనపైనా అభ్యంతరం..
శాసనసభలో వైఎస్ జయంతి ప్రస్తావన తేవడంపైనా టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. "ఏడాది క్రితమే వైఎస్ మరణం పట్ల సంతాపం తెలుపుతూ తీర్మానం చేశాం. ఆయనంటే మాకూ గౌరవముంది. గత సంప్రదాయాలకు భిన్నంగా మరణించిన ఒక వ్యక్తి జయంతిని పురస్కరించుకుని మాట్లాడటం సరికాదు'' అని టీడీపీ సీనియర్ నేత అశోక గజపతిరాజు అన్నారు.

దీనిపై స్పీకర్ స్పందిస్తూ... మనలో ఉన్న వ్యక్తి ఒక దుర్ఘటనలో మరణించినందునే గుర్తు చేసుకున్నామని... ప్రతి దానినీ వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. దీనిపై అశోక్ తిరిగి మాట్లాడుతూ... గతంలో ఏ నాయకుడి జయంతి రోజైనా మాట్లాడామా అని ప్రశ్నించారు. ఈ సమయంలో సీఎం జోక్యం చేసుకుని... "మంచిని మాట్లాడుకోవడం దుష్ట సాంప్రదాయం ఎలా అవుతుంది? మంచి మాట చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పవద్దు. దయచేసి సభా గౌరవాన్ని భంగపరచవద్దు'' అని కోరారు.

వైఎస్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ మహమ్మద్ జానీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, పీఆర్పీ అధినేత చిరంజీవి, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్, సీపీఎం పక్ష నేత జూలకంటి రంగారెడ్డి, సీపీఐ పక్ష నేత గుండా మల్లేశ్, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. అయితే... వైఎస్ ఫొటో పెట్టేముందు విపక్షాలను కూడా అడిగి ఉండాల్సిందని గుండా మల్లేశ్, జూలకంటి రంగారెడ్డి అభిప్రాయపడ్డారు.

వైఎస్ చిత్రపటం ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం చేయడం శోచనీయమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ చిత్రపటాన్ని గానీ, ఇంకెవరిదైనా గానీ పెట్టదలచుకున్నప్పుడు కమిటీలో మాట్లాడుకుంటే బాగుంటుందని సూచించారు. వైఎస్ చిత్రపటాన్ని కమిటీ హాల్లో పెట్టడానికి స్పీకర్ అంగీకరించినందుకు ఎమ్మెల్యే శంకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ చిత్రపటాన్నీ పెట్టాలని సూచించారు.